: సీరియస్ సలహా... రూ. 2 వేల నోటును పరీక్షించినట్టు రూ. 500 నోటును పరీక్షించొద్దు!

కొత్త కరెన్సీ నాణ్యతను పరీక్షించి వాటి వీడియోలను సోషల్ మీడియాలో పెడుతూ బిజీగా గడుపుతున్న ఔత్సాహికులు మరో వీడియోను తెచ్చారు. రూ. 2 వేల కరెన్సీ నోటను నీటిలో ముంచి, అది రంగు, రూపాన్ని కోల్పోలేదని నిరూపించింది నేటి తరం యువత. ఇప్పుడిక రూ. 500 నోటు వంతు వచ్చింది. అయితే, అది యాదృచ్ఛికంగానే జరగడం గమనార్హం. శంకరమఠం ప్రాంతానికి చెందిన హైకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్‌, నిన్న ఏటీఎం నుంచి డ్రా చేసిన రూ. 500 నోటును (నంబర్ 5 ఏసీ 377217) బయటకు తెస్తుండగా, చేతిలోంచి జారి నీళ్లలో పడిపోయింది. వెంటనే ఆ నోటును బయటకు తీసి, ఫ్యాన్ గాలికి ఆరబెట్టగా, ఇదుగో ఇలా మారిపోయింది. రంగు వెలిసి ఆనవాళ్లు కోల్పోవడంతో పాటు, జాతిపిత గాంధీ బొమ్మతో, ఇతర అక్షరాలు సైతం పాడైపోయాయి. దీంతో ఇంతకీ అది అసలు నోటా? లేక నకిలీదా? అని ఆజాద్ విస్తుపోయారు. పాడైపోయిన 500 రూపాయల నోటు చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇక రూ. 2 వేలను పరీక్షించినట్టు రూ. 500ను పరిశీలించరాదన్న నీతి ఈ ఘటనతో తెలుస్తోందని, 500 నోట్లతో నీటి ప్రయోగాలు వద్దని, చేస్తే నోటు చెల్లకుండా పోతుందని సోషల్ మీడియా సలహా ఇస్తోంది.

More Telugu News