: దేవుడు గట్టిగా దయతలిస్తే వచ్చేఏడాది ఎన్నికలు రావచ్చు: వైఎస్ జగన్
కృష్ణా జిల్లా బుద్ధాలపాలెంలో ఈ రోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అక్కడ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మరో రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని, దేవుడు గట్టిగా దయతలిస్తే వచ్చేఏడాదే ఎన్నికలు రావచ్చని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తే ఇక తామే విజయం సాధిస్తామని చెప్పారు. చంద్రబాబు చేస్తోన్న అన్యాయాల పట్ల రైతులు అసహనంతో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు పాలన ఎన్నో ఏళ్లు ఉండదని చెప్పారు. ఆ తరువాత వచ్చేది మన ప్రభుత్వమే, ప్రజల ప్రభుత్వమేనని జగన్ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలో పోర్టు కోసం లక్షా 5 వేల ఎకరాల భూమి అవసరమని చంద్రబాబు నాయుడు అంటున్నారని, ఎన్నికల ముందు 3000 ఎకరాలు చాలని వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంత భారీ మొత్తంలో భూములు తీసుకోవాలని చూడడం ఏంటని జగన్ ప్రశ్నించారు. అసలు పోర్టు నిర్మాణానికి ఎన్ని ఎకరాలు కావాలో చంద్రబాబు చెప్పాలని ఆయన నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే పోర్టు కోసం ఎంతకావాలో అంతభూమి మాత్రమే తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను దారుణంగా వేధిస్తోందని అన్నారు. చంద్రబాబు పాలన పోవాలని అందరూ దేవుడిని మొక్కాలని జగన్ సూచించారు.