: గుంటూరు నగర వాసులకు అందుబాటులోకొచ్చిన ఆర్టీసీ మినీ బస్సులు

గుంటూరు నగర వాసులకు ఆర్టీసీ మినీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా గుంటూరు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్ఞానం శ్రీహరి మాట్లాడుతూ, నిన్నటి నుంచి ఐదు మినీ బస్సు సర్వీసులను ప్రారంభించామని పేర్కొన్నారు. నగర ప్రధాన కూడళ్లతో పాటు జీఎంసీ పరిధిలోకి వచ్చిన నాలుగైదు గ్రామాల మీదుగా ఈ బస్సు సర్వీసు రూట్లను ఖరారు చేశామన్నారు. కొన్నేళ్లుగా స్థానిక పాత గుంటూరు, సంగడిగుంట, శ్రీనివాసరావుతోట, ఏటీ అగ్రహారం మీదుగా ఆర్టీసీ సర్వీసులు లేవని, కొత్తగా ప్రవేశపెట్టిన ఈ మినీ బస్సులను ఆయా రూట్లలో తిప్పుతున్నామని చెప్పారు. నగర వాసులకు అందుబాటులో ఉండే విధంగా ప్రయాణ ఛార్జీలు ఉన్నాయని పేర్కొన్నారు. నగరంలో తిరిగే బస్సుల నిర్ణీత వేళలకు సంబంధించిన ప్రచార బోర్డులను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గతంలో గుంటూరు నగరాన్ని అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన, ప్రస్తుతం తిరుగుతున్న 18 మెట్రో సర్వీసులు కొనసాగుతాయని చెప్పారు.

More Telugu News