: ముఖ్యమంత్రుల క‌మిటీలో ఉండడానికి ఒప్పుకోని త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌

పెద్దనోట్ల‌ ర‌ద్దు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై అధ్య‌య‌నం చేసి నివేదిక తెప్పించుకోవ‌డంతో పాటు ఆర్థిక లావాదేవీలను డిజిటల్‌ రూపంలోకి తెచ్చేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆరు రాష్ట్రాల సీఎంలతో క‌మిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో ఈ క‌మిటీలో స‌భ్యులుగా మ‌ధ్యప్ర‌దేశ్‌, ఒడిశా, పుదుచ్చేరి, త్రిపుర, బీహార్ ముఖ్య‌మంత్రుల‌ను నియ‌మించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచించింది. అయితే, ఈ ముఖ్యమంత్రుల బృందంలో స‌భ్యుడిగా ఉండ‌డానికి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్ విముఖత వ్యక్తం చేశారు. ప్ర‌ధాని మోదీ సూచన మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాణిక్ స‌ర్కార్‌కు ఫోన్ చేయ‌గా తాను ఆ బృందంలో ఉండ‌బోనని తేల్చిచెప్పారు. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాణిక్‌ సర్కార్ పేర్కొన్నారు. ఏటీఎంలలో పూర్తి స్థాయిలో డ‌బ్బు అందుబాటులోకి వ‌చ్చేవ‌ర‌కు ర‌ద్దైన‌ రూ.500, రూ.1000 నోట్లను చలామణి చేసుకునేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేయాల‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News