: మూడు షిఫ్టుల్లో నోట్ల ప్రింటింగ్.. అయినా రోజుకు రూ. 3 వేల కోట్లు మాత్ర‌మే ముద్ర‌ణ‌

నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను ప్ర‌త్య‌క్షంగా చూస్తున్న ప్ర‌భుత్వం నోట్ల ప్రింటింగ్‌లో వేగాన్ని పెంచింది. రెండు షిఫ్టుల్లో నోట్ల‌ను ముద్రించ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌డం లేద‌ని, త‌గిన‌న్ని నోట్లు మార్కెట్లోకి రావ‌డం లేద‌ని భావించిన ప్ర‌భుత్వం మూడు షిఫ్టుల్లో ముద్ర‌ణ ప్రారంభించింది. నోట్ల ర‌ద్దు త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే రూ.500 నోట్ల‌ను భ‌ర్తీ చేయాలంటే రూ.8.3 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు మార్కెట్లోకి రావాల్సి ఉంటుంది. ఇందుకోసం 1660 కోట్ల నోట్ల‌ను ముద్రించాలి. ప్ర‌స్తుతం నాసిక్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో రూ.500, రూ.100, రూ.50 నోట్ల‌ను జోరుగా ప్రింట్ చేస్తున్నారు. అన్నీ కలిపినా రోజుకు రూ.2.2 కోట్ల‌కు మించి ప్రింట్ కావ‌డం లేదు. నవంబ‌రు 11వ తేదీ నుంచి 11 రోజుల్లో మొత్తంగా 16.1 కోట్ల‌ను ముద్రించి ఆర్బీఐకి అంద‌జేశారు. వాటిలో ఉన్న కొత్త రూ.500 నోట్లు రూ.2.9 కోట్లే. రూ.100 నోట్లు రూ.8.5 కోట్లు, రూ.20 నోట్ల‌ను రూ.4.7 కోట్లు ముద్రించారు. మ‌రోవైపు మైసూర్‌, సాల్బోనీ, దేవాస్ ప్రెస్‌ల‌లోనూ రూ.500 నోట్ల‌ను ముద్రిస్తున్నా అన్నీ క‌లిపి రోజుకు రూ.3 వేల కోట్ల‌కు మించ‌డం లేదు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో 40 కోట్ల నోట్ల‌ను ముద్రించాల‌ని నాసిక్ ప్రెస్‌కు ల‌క్ష్యాన్ని నిర్దేశించారు. అంటే ఆ నోట్ల మొత్తం విలువ రూ.20 వేల కోట్లు. ఈ లెక్క‌న చూసుకుంటే అన్ని ప్రెస్‌ల‌లో క‌లిపి 500 నోట్ల‌ను పూర్తిస్థాయిలో ముద్రించేందుకు త‌క్కువ‌లో త‌క్కువ‌గా ఆరునెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. దీంతో షిప్టులు పెంచారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు షిప్టుల్లో మాత్ర‌మే ముద్ర‌ణ జ‌రిగేది. ఇప్పుడు రోజుకు మూడు షిప్టుల్లో నిరంత‌రాయంగా నోట్లను ముద్రిస్తున్నారు. ఫ‌లితంగా 35 శాతం ఉత్ప‌త్తి పెరిగింది.

More Telugu News