: రేప‌టితో ముగియ‌నున్న తెలంగాణ సీఎస్ రాజీవ్‌శ‌ర్మ ప‌ద‌వీ కాలం

తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్ శర్మ పదవీ కాలం రేప‌టితో ముగియ‌నుంది. వాస్తవానికి ఈ ఏడాది మే నెలాఖరునే ఆయ‌న పదవీ కాలం ముగిసింది. అయితే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల చొప్పున వరుసగా రెండు సార్లు ఆయ‌న‌ పదవీ కాలాన్ని పొడిగించింది. తాజాగా ఆ కాల‌వ్య‌వ‌ధి కూడా ముగియ‌డంతో ఆయ‌న రేపు ప‌ద‌వీవిర‌మ‌ణ చేయ‌నున్నారు. రాజీవ్ శ‌ర్మ‌కు ఘన వీడ్కోలు పలకాలని రాష్ట్ర స‌ర్కారు నిర్ణయించింది. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లోని తెలంగాణ‌ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన పదవీ విరమణ చేయనున్న సంద‌ర్భంగా ఆయ‌న‌ను స‌త్క‌రించ‌నున్నారు. రాజీవ్ శ‌ర్మ‌ పదవీ విరమణ తర్వాత ఆయ‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా నియమించి, ఆయన సేవలను ఉపయోగించుకోవాలని స‌ర్కారు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News