: మ‌రో వివాదంలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ర‌మ్య‌.. రౌడీ అంటూ యువ‌కుడిపై దుర్భాష‌లు

కాంగ్రెస్ మాజీ ఎంపీ ర‌మ్య మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ఓ యువ‌కుడిని రౌడీ అంటూ దుర్భాష‌లాడారు. ర‌మ్య గ‌తంలో మండ్య ఎంపీగా ఉన్న‌ప్పుడు 'వ‌న్ ఇండియా.. వ‌న్ ఎంపీ' అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, వాటికి ప‌రిష్కార మార్గాలపై థీసిస్ స‌మ‌ర్పించిన వారికి రూ.2.5 ల‌క్ష‌ల బ‌హుమానం ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 117 మంది యువ‌కులు త‌మ థీసిస్‌ను ఎంపీకి పంపారు. అయితే ఎంపీగా త‌న ప‌ద‌వీ కాలం ముగిసిన త‌ర్వాత ర‌మ్య ఆ విష‌యాన్ని పక్క‌న‌పెట్టేశారు. సోమ‌వారం ర‌మ్య క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి వ‌స్తున్న‌ట్టు తెలుసుకున్న థీసిస్ పంపిన వారిలో ఒక‌రైన చిక్క‌మ‌ర‌ళి గ్రామానికి చెందిన పాండుదుదై అనే యువ‌కుడు అక్క‌డికి వెళ్లాడు. ర‌మ్య రాగానే వ‌న్ ఇండియా కార్య‌క్ర‌మంపై మాజీ ఎంపీని నిల‌దీశాడు. దీంతో స్పందించిన‌ ర‌మ్య‌.. తాను ఇప్పుడు ఎంపీని కాద‌ని, ఆ విష‌యాన్ని ప్ర‌స్తుత ఎంపీ వ‌ద్ద తేల్చుకోవాలంటూ సూచించారు. బ‌హుమ‌తి ఇవ్వ‌క‌పోయినా ప‌ర్లేదు కానీ క‌నీసం థీసిస్ పంపిన వారిని అభినందించాల‌ని కోరాడు. దీంతో స‌హ‌నం కోల్పోయిన ర‌మ్య, 'నువ్వు రౌడీలా మాట్లాడుతున్నా'వంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంట‌నే క‌ల‌గ‌జేసుకున్న ర‌మ్య మ‌ద్ద‌తుదారులు యువ‌కుడిపై దాడికి దిగారు. స్థానికులు పాండుదురైని ర‌క్షించి ర‌మ్య‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. విష‌యం తెలుసుకున్న బీజేపీ కార్య‌క‌ర్త‌లు , పోలీసులు క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి చేరుకుని ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు.

More Telugu News