: పొరపాటున పేలిన తుపాకీ... కొడుకు శరీరంలోకి దిగిన తూటా... ఆదుర్దాతో తండ్రి ఆత్మహత్య

ఈ విషాద ఘటన కేరళలోని అంగమల్లి సమీపంలోని అయ్యపుఝలో చోటు చేసుకుంది. 55 ఏళ్ల మ్యాథ్యూ అనే వ్యక్తి తుపాకీని క్లీన్ చేస్తుండగా... పొరపాటున అది పేలింది. దీంతో, అందులోని తూటా అతని కుమారుడు మనూ (20) శరీరంలోకి దూసుకుపోయింది. తుపాకీ పేలిన శబ్దానికి చుట్టుపక్కల వాళ్లు ఉలిక్కిపడి, అక్కడకు పరుగున వెళ్లారు. వెంటనే గాయపడ్డ మనూను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వారంతా వెళ్లిన తర్వాత, కన్నకొడుకు బతుకుతాడో లేదో అనే ఆవేదనలో మ్యాథ్యూ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ బ్యాంక్ లో మ్యథ్యూ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. అతని భార్య డైలీ వేజ్ లేబర్ గా పని చేస్తోంది. మరోవైపు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనూ కోలుకుంటున్నాడు. చిన్న గాయంతోనే మనూ గట్టెక్కాడని, కీలకమైన అవయవాలకు బుల్లెట్ తగలకపోవడంతో అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని డాక్టర్లు తెలిపారు. డిగ్రీ చదివిన మనూ ఓ షాపులో పనిచేస్తున్నాడు. మ్యాథ్యూ ఆత్మహత్య ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.

More Telugu News