: నిన్న జైలు నుంచి పారిపోయిన ఖలిస్థాన్ చీఫ్ హర్మీందర్ మింటూ అరెస్ట్

మరో నలుగురు తీవ్రవాదులతో కలసి నిన్న పంజాబ్, పాటియాలాలో ఉన్న నభా జైలు నుంచి పారిపోయిన ఖలిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ హర్మీందర్ మింటూను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం ఢిల్లీ పోలీసులు మింటూను అదుపులోకి తీసుకున్నారని, జైలు నుంచి పారిపోయిన 24 గంటల్లోపే అరెస్ట్ చేయగలిగామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా నిన్న తెల్లవారుఝామున సుమారు 12 నుంచి 14 మంది పోలీసుల దుస్తుల్లో ఆయుధాలు ధరించి వచ్చి, నభా జైలులోకి చొరబడి, మింటూ, మరో నలుగురిని విడిపించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్ననే ఓ ఉగ్రవాది పోలీసులకు చిక్కగా, అసలు వ్యక్తిని నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, వీరిని కోర్టు ముందు హాజరు పరిచి తిరిగి జైలుకు తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు. మిగతావారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేయగలమన్న ఆశాభావాన్ని పోలీసులు వ్యక్తం చేశారు. వీరి ఆచూకీ తెలిపితే రూ. 25 లక్షలు బహుమతిగా ఇస్తామని పంజాబ్ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News