: యూదులను హిట్లర్ ఏం చేశాడో... ముస్లింలను ట్రంప్ అదే చేస్తారు!: మసీదులకు బెదరింపు లేఖ

అమెరికాకు అధ్యక్షుడు కాబోతున్న డొనాల్డ్ ట్రంప్, ముస్లింలను దేశం నుంచి తరిమికొడతారని బెదిరిస్తూ, మసీదులకు లేఖలు అందుతుండటం కలకలం రేపుతోంది. కాలిఫోర్నియాలోని మసీదులకు వచ్చిన లేఖల్లో యూదులను హిట్లర్ ఏం చేశాడో, అమెరికాలోని ముస్లింలను ట్రంప్ అదే చేయనున్నారని బెదరింపులు వచ్చినట్టు కౌన్సిల్ ఆన్ ఇస్లామిక్ - అమెరికన్ రిలేషన్స్ (సీఏఐఆర్) ఆరోపించింది. ఈ మేరకు శాన్ జోస్, లాంగ్ బీచ్, పొమోనా తదితర ప్రాంతాల్లోని మసీదులకు లేఖలు వచ్చాయని, ముస్లింలు చెడ్డవారని ఆరోపిస్తూ, ముస్లింల తల్లిదండ్రులను జంతువులతో పోల్చారని, "మీరు దయ్యాలు. దయ్యాలనే పూజిస్తారు. మీరు వెళ్లిపోయే రోజు దగ్గరికొచ్చింది" అని ఆ లేఖల్లో ఉందని వివరించింది. శాన్ జోస్ లోని ఎవర్ గ్రీన్ ఇస్లామిక్ సెంటర్ కు తొలి లేఖ వచ్చిందని, ఆపై మిగతా మసీదులకూ లేఖలు అందాయని సీఏఐఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హుస్సామ్ ఐలోష్ వెల్లడించారు. ఈ లేఖలతో మసీదు చుట్టు పక్కల ప్రాంతాల్లోని ముస్లిం వర్గాలు భయాందోళనలకు గురవుతున్నాయని ఆయన తెలిపారు.

More Telugu News