: నోట్లు రద్దయినంత మాత్రాన ఇండ్ల ధరలేమీ దిగిరావు: క్రెడాయ్

ఇండియాలో పెద్ద నోట్లు రద్దయిన తరువాత, గృహాల ధరలు దిగివస్తాయని, మధ్య తరగతి ప్రజలు సులువుగా సొంతింటిని సమకూర్చుకుంటారని వచ్చిన విశ్లేషణలను నిర్మాణ రంగ కంపెనీల సంఘం క్రెడాయ్ ఖండించింది. ప్రాథమిక మార్కెట్లో ఇప్పటికే ధరలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇంతకుమించి ధరల పతనాన్ని ఊహించలేమని వెల్లడించింది. ఇదే సమయంలో లగ్జరీ విభాగంలో ధరలు కొంత తగ్గవచ్చని పేర్కొంది. నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని, దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు, లంచగొండితనాన్ని రూపుమాపేందుకు, నకిలీ నగదు చెలామణి, ఉగ్రవాదులకు నిధుల లభ్యతను నిలువరించేందుకు కేంద్ర నిర్ణయం ఉపకరిస్తుందిన ఓ ప్రకటనలో క్రెడాయ్ పేర్కొంది. నోట్ల రద్దు తరవాత, ప్రైమరీ విభాగంలో రియల్ ఎస్టేట్ సెక్టారు 15 శాతం మేరకు వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది. దేశ జీడీపీలో వ్యవసాయం తరువాత అత్యధిక భాగస్వామ్యాన్ని కలిగిన విభాగంగా నిర్మాణ రంగం కొనసాగుతుందని పేర్కొంది. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగడంతో 1.75 శాతం వరకూ పొదుపు రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని క్రెడాయ్ అంచనా వేసింది. కాగా, క్రెడాయ్, 23 రాష్ట్రాల్లోని 166 నగరాలు, పట్టణాల్లో 11,500కు పైగా రియల్ ఎస్టేట్ డెవలపర్ల భాగస్వామ్యంతో ప్రైవేటు నిర్మాణ రంగ సంస్థల ప్రధాన సంఘంగా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News