: పెద్ద నోట్ల రద్దు కేంద్రం ఆలోచన కాదు, ఆర్బీఐ సలహాయే!: న్యాయ, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్

ఇండియాలో పెద్ద నోట్లను రద్దు చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానిది కాదని న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సలహా, సిఫార్సుల మేరకే రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఆర్థిక పరిభాషలో నగదు ఉపసంహరణ (డీమానిటైజేషన్)గా దీన్ని అభివర్ణించలేమని, నోట్లు చట్టపరంగా చెల్లవని మాత్రమే భావించాలని, వాటి స్థానంలో కొత్త కరెన్సీ వస్తోందని ఆయన అన్నారు. నోట్లను మార్చడం అన్నది ఆర్బీఐ నిర్ణయాధికారాల మేరకు జరిగిందని తెలిపారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగా, అప్పటి నుంచి ప్రజలు చిల్లర నోట్ల కోసం తీవ్రంగా అవస్థలు పడుతూ, బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. పాత 500, 1000 నోట్ల చలామణి ఈ నెల 9 నుంచే ఆగిపోగా, కొన్ని అత్యవసర సేవలు, చెల్లింపులకు మాత్రం వాటిని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News