: ప్రతి మనిషి రూ. 10 వేలు సంపాదించే ఫార్ములా నా వద్ద ఉంది: చంద్రబాబు

తండ్రి రాజశేఖర్ రెడ్డి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించిన జగన్ కు సామాన్యుల సంక్షేమం పట్టదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్ విషయానికొస్తే పార్టీ మొత్తం అవినీతిమయమే అని అన్నారు. సమాజం అభివృద్ధి పథంలో పయనించాలంటే... ఫ్యాన్, హస్తాలు వదిలేసి, సైకిల్ ఎక్కాలని పిలుపునిచ్చారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముకోవడం వల్ల ప్రజలకు ఒనగూరేది ఏమీ లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రతి మనిషి రూ. 10 వేలు సంపాదించే ఫార్ములా తన వద్ద ఉందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు కడప జిల్లా రాజంపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా రాజంపేట క్రీడామైదానంలో విద్యార్థులతో కలసి మొక్కలను నాటారు. అనంతరం అక్కడ నిర్మించిన ఇండోర్ స్టేడియంను ప్రారంభించారు. దళితవాడలో మంచినీటి పథకం, దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలు శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ రహదారి నుంచి పాత బస్టాండు వరకు జనచైతన్య యాత్రను చేపట్టారు.

More Telugu News