: ప్రముఖ పాకిస్థానీ రంగస్థల నటి కిస్మత్ బేగ్ దారుణ హత్య

ప్రముఖ పాకిస్థానీ రంగస్థల నటి కిస్మత్ బేగ్ ను దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. గురువారం సాయంత్రం ఈ దారుణ ఘటన జరిగింది. లాహోర్ లో ఓ షో ముగించుకుని ఇంటికి వెళుతుండగా, బైక్ లను అడ్డంగా ఆపి ఆమె ప్రయాణిస్తున్న కారును దుండగులు నిలిపి వేశారు. ఆమె తేరుకునేంతలోనే, సాయుధులు ఆమెను చుట్టుముట్టారు. ఇప్పడు చేయగలవా డ్యాన్స్? అని కోపంగా అరుస్తూ, విచక్షణారహితంగా ఆమె కాళ్లు, చేతులు, పొట్ట భాగంలో కాల్పులు జరిపి పారిపోయారు. ప్రాణాపాయంలో ఉన్న ఆమెను, ఆమె డ్రైవర్ ను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఉపయోగం లేకపోయింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె కన్నుమూసింది. ఈ ఉదంతం పాకిస్థాన్ ను కుదిపేసింది. ఫైసలాబాద్ లో వ్యాపారవేత్త, కిస్మత్ బేగ్ మాజీ ప్రియుడు అయన ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం, దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాకిస్థాన్ నటీమణులపై దాడులు పెరిగిపోతున్నాయి. జూలైలో టాప్ మోడల్ ఖందిల్ బలూచ్ ను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఓ టీవీ యాంకర్ పై విష ప్రయోగం జరిగింది. మరో తొమ్మిది మంది కళాకారిణులు కూడా దారుణ హత్యకు గురయ్యారు. ముల్తాన్, లాహోర్ లాంటి నగరాల్లో ఈ దాడులు అధికంగా జరుగుతున్నాయి.

More Telugu News