: నాగోల్ బ్రిడ్జి సమీపంలో నోట్ల మూటల వదంతులు.. పరుగులు తీసిన ప్రజలు!

నోట్ల రద్దు నాటి నుంచి ఏదో ఒక చోట పెద్దనోట్లు వెదజల్లారని, కరెన్సీ మూటలు వదిలిపెట్టారని, నదిలో నోట్లు కొట్టుకువస్తున్నాయనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, కొన్ని వార్తల్లో వాస్తవం ఉన్నప్పటికీ, మరికొన్ని వార్తలు మాత్రం వదంతులుగానే మిగిలిపోయాయి. తాజాగా, హైదరాబాద్ శివారులోని నాగోల్ బ్రిడ్జి సమీపంలో పాత నోట్ల మూటలు పడి ఉన్నాయి.. అంటూ ఈరోజు సాయంత్రం కలకలం రేగింది. దీంతో, స్థానికులు, ఉప్పల్- ఎల్బీనగర్, ఎల్బీనగర్-ఉప్పల్ వెళ్లే వాహనదారులు తమ వాహనాలను పక్కనపెట్టేసి ఆ మూటల కోసం పరుగులు తీశారు.. వెతుకులాడారు. ఎంత వెతికినా పాతనోట్ల మూటలు కనిపించకపోవడంతో నిరాశతో ఎదురు తిరిగారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అక్కడ ఎలాంటి నోట్ల మూటలు కనిపించకపోగా, ఎవరో పారేసిన ఒక చెత్త మూట అక్కడ దర్శనమిచ్చింది. ఇటువంటి వదంతులను ఎవరూ నమ్మవద్దని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.

More Telugu News