: కలచివేసే ఘటన... ఒకే గదిలో 14 పిల్లుల బందీ... ఆకలితో ఒకదాన్నొకటి చంపుకుతిన్న పిల్లులు

అత్యంత దారుణమైన ఈ ఘటన ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. 43 ఏళ్ల ఓ మహిళ 14 పిల్లులను ఓ గదిలో బంధించి తాళం వేసుకుని వెళ్లి పోయింది. ఆకలికి తట్టుకోలేక పోయిన ఆ పిల్లులు ఒకదాన్ని మరొకటి చంపుకుంటూ ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేశాయి. ఈ విషయం ఎలాగోలా బయటకు పొక్కింది. దీంతో, పోలీసులు అక్కడకు చేరుకుని, తలుపులు బద్దలు కొట్టుకుని గదిలోకి వెళ్లారు. అక్కడి పరిస్థితి చూసిన వారంతా షాక్ కు గురయ్యారు. గది లోపలి పరిస్థితి చాలా భయానకంగా ఉంది. 14 పిల్లుల్లో 13 పిల్లులు చనిపోయాయి. ఒక్కటి మాత్రమే బతికి ఉంది. అది కూడా బక్కచిక్కిపోయి, చాలా నీరసంగా ఉంది. చనిపోయిన పిల్లుల కళేబరాలు చిందరవందరగా పడున్నాయి. గత ఏడాది డిసెంబరులో ఈ ఘటన జరిగింది. ఈ కేసును విచారించిన పోర్ట్ అడిలైడ్ కోర్టు తాజాగా పలు సూచనలు చేసింది. పెంపుడు జంతువులను పెంచుకునేవారు ఏ కారణం చేతనైనా వాటిని జాగ్రత్తగా చూడలేమనుకున్న సమయంలో జంతు సంరక్షణాలయానికి అప్పగించాలని చెప్పింది. ఇష్టం వచ్చినట్టు వాటిని వదిలేయడం మంచిది కాదని తెలిపింది. మరోవైపు, సదరు మహిళ చేత ఇంకెప్పుడూ పెంపుడు జంతువులను పెంచుకోననే డిక్లరేషన్ తీసుకుంది. 12 నెలల సత్ప్రవర్తన బాండ్ ను కూడా తీసుకుంది. గతంలో కోర్టు విచారణకు సరిగా హాజరు కాకపోవడంతో... ఆమెను రెండు వారాల పాటు కస్టడీలో ఉంచారు. అయితే, ఆమె మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, చిన్న శిక్షతోనే సరిపెట్టింది కోర్టు.

More Telugu News