: మీ దగ్గరున్న పాత 500 నోటు ఇక్కడ చెల్లుతుంది...!

బ్యాంకుల్లో 500, 1000 రూపాయల నోట్ల మార్పిడిని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్లు ఎక్కడెక్కడ చెల్లుతాయన్నది వివరించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేవలం 500 రూపాయల నోట్లు మాత్రమే వివిధ ప్రాంతాల్లో చెల్లుబాటు కానున్నాయి. వెయ్యి రూపాయల నోట్లు బ్యాంకుల్లో మినహా మరెక్కడా చెల్లవు. అది కూడా తమ ఖాతాల్లో మాత్రమే జమ చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 500 రూపాయల నోట్లు ఎక్కడెక్కడ చెల్లనున్నాయంటే... పౌర సేవల బిల్లులైన విద్యుత్, నీటి బిల్లుల బకాయిలు చెల్లించుకోవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్లలో 500 రూపాయల నోట్లతో ఆస్తి పన్ను చెల్లించడం కుదరదు. జాతీయ రహదారుల్లోని టోల్ ప్లాజాల్లో డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకూ టోల్ వసూలు లేదన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 3 నుంచి 15 వరకు 500 రూపాయల నోట్లను చెల్లించవచ్చు. అలాగే పెట్రోల్ బంకులు, శ్మశాన వాటికలు, కోర్టు ఫీజుల్లో 500 రూపాయల నోట్లను అంగీకరించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే పాల కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య ఖర్చులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో అన్ని మందుల షాపుల్లో మందుల కొనుగోలులో 500 రూపాయల నోట్లు చెల్లించవచ్చు. ఇంకా రైల్వే టికెట్ కౌంటర్లు, రైల్వే క్యాటరింగ్ సర్వీసులు, సబర్బన్, మెట్రో రైల్ టికెట్ల కొనుగోళ్లు, బస్సు టికెట్ కౌంటర్లు (ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సహకారంతో నడిచే బస్సులు), ఎయిర్‌ పోర్టు కౌంటర్లలో 500 రూపాయల నోట్లు స్వీకరించనున్నారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొనుగోలులో కూడా 500 రూపాయల నోట్లు చెల్లించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీ, స్థానిక సంస్థల స్కూళ్లలో ఒక్కో విద్యార్థి 2 వేల రూపాయల ఫీజులు 500 రూపాయల నోట్ల రూపంలో చెల్లించే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. 500 రూపాయల నోటుతో రీఛార్జ్ చేసుకోవచ్చు. అది కూడా ఆథరైజ్డ్ షాపుల్లో మాత్రమే. రైతులు రాష్ట్ర ప్రభుత్వ విక్రయ కేంద్రాల నుంచి విత్తనాలు కొనుగోలు చేసేందుకు 500 రూపాయల నోట్లు చెల్లించవచ్చు. కన్జూమర్ కో-ఆపరేటివ్ స్టోర్లలో సుమారు 5 వేల రూపాయల వరకు 500 రూపాయల నోట్లు చెల్లించి కొనుగోళ్లు చేయవచ్చు. విదేశీయులు వారానికి 5 వేల రూపాయల వరకు రూపాయలను మార్చుకోవచ్చు. అయితే ఆ వివరాలు పాస్ పోర్టులో నమోదు చేయాలి. లేని పక్షంలో మార్చుకునే అవకాశం లేదు.

More Telugu News