: కోతిని హింసించి చంపిన‌ సీఎంసీ కాలేజీ విద్యార్థులు.. మండిప‌డ్డ త్రిష‌, రాధిక‌

క‌ళాశాల ప్రాంగ‌ణంలోకి వ‌చ్చిన ఓ కోతిని ప‌ట్టుకున్న ప‌లువురు యువ‌కులు దాన్ని చిత్ర‌హింస‌లు పెట్టి చంపేశారు. భ‌విష్య‌త్తులో స్టెత‌స్కోపు ప‌ట్టుకొని సేవ‌లు అందిస్తూ మ‌నుషుల ప్రాణాలు కాపాడాల్సిన విద్యార్థులే ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌డం ప‌ట్ల జంతు ప్రేమికులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై వేలూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాలలో నలుగురు విద్యార్థులు క్యాంప‌స్‌లోకి వ‌చ్చిన‌ ఓ కోతిని దుప్పటితో కప్పి ప‌ట్టుకున్నారు. దాని చేతులు కట్టేసి ఇతర విద్యార్థుల ముందే బెల్టులు, కట్టెలతో కొట్టి చిత్రహింస‌లు పెట్టారు. ఓ ఇనుపచువ్వని దాని శరీరంలోకి దూర్చి క‌ర్క‌శ‌త్వం ప్ర‌ద‌ర్శించారు. అనంత‌రం ఆ కోతి క‌ళేబ‌రాన్ని వ‌స‌తిగృహానికి సమీపంలోనే గుంత తవ్వి పాతి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అక్క‌డి జంతు సంక్షేమ కార్యకర్త శ్రావణ్‌ కృష్ణన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన నలుగురు వైద్య విద్యార్థులను తీసుకువెళ్ళి, పోలీసులు కోతి కళేబరాన్ని బయటకు తీశారు. ఆ నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం వ‌స‌తి గృహ‌ జనరల్‌ సెక్రెటరీతో పాటు ఈ నలుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేసింది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న సినీ నటీమ‌ణులు రాధిక, త్రిష ట్విట్టర్ లో మెడికోల దుశ్చ‌ర్య ప‌ట్ల మండిప‌డ్డారు. భవిష్యత్తులో డాక్ట‌ర్ వృత్తి చేప‌ట్టి, ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడాల్సిన వారే ఇలాంటి చ‌ర్య‌కు పాల్ప‌డ‌డం త‌మ‌కు చాలా బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు.

More Telugu News