: రికార్డు స్థాపించే వేళ... ఓ సినిమా పాట గుర్తుకు రాకపోవడంతో, టెస్టు మ్యాచ్ ని ఆపేసిన సెహ్వాగ్... ఆ'పాత' మధురం!

వీరేంద్ర సెహ్వాగ్... క్రికెట్ కు స్వస్తి చెప్పిన తరువాత కూడా క్రీడాభిమానులకు దూరం కాకుండా సామాజిక మాధ్యమాల రూపంలో దగ్గరగా ఉంటూ వస్తున్న వ్యక్తి. ఇక గోరేగావ్ స్పోర్ట్స్ క్లబ్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ప్రారంభోత్సవ వేళ, ఓ పాత ఘటనను సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. 2008లో చెన్నైలో సౌతాఫ్రికాపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో, ట్రిపుల్ సెంచరీకి దగ్గరైన వేళ, కాస్తంత రిలాక్స్ కావాలని భావించినట్టు చెప్పాడు. ఆ సమయంలో తాను పాడుకోవాలని అనుకున్న పాట 'తూ జానే నా' (అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ) గుర్తుకు రాకపోవడంతో ఆటను ఆపించానని గుర్తు చేసుకున్నాడు. 12వ ఆటగాడిగా ఉన్న ఇషాంత్ శర్మను పిలిచి, ఆ పాట లిరిక్స్ తన ఐపాడ్ లో ఉన్నాయని చెప్పి, వాటిని చూసొచ్చి చెప్పాలని కోరినట్టు వెల్లడించాడు. తానేదో తాగేందుకు నీరు అడుగుతున్నట్టు ప్రతి ఒక్కరూ భావించారని, కానీ తాను పాట లిరిక్స్ కోసం తాను మ్యాచ్ ని ఆపించానని చెప్పాడు. ఇక షోయబ్ తనకు బౌలింగ్ వేస్తున్న వేళ 'ఆ దేఖే జరా, కిస్ మే కిత్నా హై దమ్' పాటను పాడుకున్నానని చెప్పాడు. ప్రతి బాల్ నూ ఎదుర్కొనే ముందు దాన్ని ఫోర్ కొట్టాలా? లేక సిక్స్ కొట్టాలా? అని ఆలోచించేవాడినని సెహ్వాగ్ వెల్లడించాడు.

More Telugu News