: కార్డు గీకండి, బస్సెక్కండి... ఏపీలో ఇక నగదు రహిత ప్రయాణాలు

ఆంధ్రప్రదేశ్ లోని పలు బస్టాండ్లలో ఈ-పాస్ యంత్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. పలు బస్టాండ్లలోని రిజర్వేషన్ కార్యాలయాలతో పాటు, నాన్ స్టాప్ బస్ సర్వీసు కౌంటర్ల వద్ద ఈ యంత్రాలను వాడుతున్నారు. టికెట్లు కావాల్సిన వారు చిల్లర గురించి చూసుకోనవసరం లేకుండా ఈ -పాస్ యంత్రాల్లో తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను స్వైప్ చేసి, పిన్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా టికెట్ ను తీసుకుని ప్రయాణం చేయవచ్చు. ఇక నగదు రహిత ప్రయాణాలను ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, త్వరలో దూరప్రాంత బస్ డ్రైవర్లకు కూడా ఈ-పాస్ యంత్రాలను అందించనున్నట్టు తెలిపారు. ప్రజలకు కష్టం కలుగకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సెర్ప్, మెప్మా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, అన్ని ఈ-పాస్ యంత్రాలనూ ఆర్టీసీకి వినియోగించాలని సూచించారు. కాగా, విజయవాడ బస్టాండ్ లో ఈ-పాస్ యంత్రాలను మంత్రి శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీలు ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 50 మెషీన్లను అందుబాటులో ఉంచామని ఈ సందర్భంగా శిద్ధా వెల్లడించారు. మరో వారం రోజుల్లో అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకూ మెషీన్లను అందిస్తామని తెలిపారు.

More Telugu News