: అనుమానాస్పద స్థితిలో నయీం అనుచరుడి మృతి!

నక్సలైట్ గా జీవితం ప్రారంభించి, నేరసామ్రాజ్యాన్ని స్థాపించిన నయీం అనుచరుడు పుల్లూరి మహేష్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నయీం ఎన్‌ కౌంటర్ జరిగినప్పటి నుంచి మహేష్ పరారీలో ఉన్నాడు. అలాంటి మహేష్ ఉన్నట్టుండి మృతదేహంగా మారి కనిపించాడు. దీంతో ఏమై ఉంటుందా? అన్న ఆసక్తి పోలీసు, సాధారణ వర్గాల్లో నెలకొంది. కాగా, మరో ఘటనలో నయీం గ్యాంగులో కీలక సభ్యుడు, అతనితో కలిసి కిడ్నాపులు, మోసాలు, నేరపూరిత కుట్రలు, భూ ఆక్రమణలు, బెదిరించి డబ్బు వసూళ్లు తదితర నేరాలకు పాల్పడిన సామా సంజీవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హయత్‌ నగర్‌ పరిధిలోని సాహెబ్‌ నగర్ ప్రాంతానికి చెందిన సంజీవరెడ్డి నయీం గ్యాంగులో కీలక సభ్యుడు. నయీంతో కలిసి ఆరు నేరాల్లో పాలుపంచుకున్నాడు. రాచకొండ పోలీసు కమిషనరేట్ ప్రకటన ప్రకారం పహాడి షరీఫ్, ఆదిభట్ల పోలీసు స్టేషన్ల పరిధిలో సామా సంజీవరెడ్డి నేరాలు చేశాడు. ప్రజాభద్రతకు ముప్పుగా పరిణమించిన సంజీవరెడ్డిని కొన్నాళ్ల పాటు సమాజానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో పీడీ యాక్టుపై అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News