: ‘ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్’ సేవలు ప్రారంభం

బ్యాంకింగ్ రంగంలోనూ భారతీ ఎయిర్ టెల్ సంస్థ సేవలు ప్రారంభమయ్యాయి. ఈరోజు రాజస్థాన్ రాష్ట్రంలోని ‘ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్’ పేరిట పైలట్ ప్రాజెక్ట్ గా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఆ రాష్ట్రంలోని పదివేల ఎయిర్ టెల్ రిటైల్ ఔట్ లెట్ల ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ ఔట్ లెట్ల ద్వారా నగదు డిపాజిట్, విత్ డ్రా, ట్రాన్స్ ఫర్, ఆన్ లైన్ షాపింగ్, బిల్ పేమెంట్స్ వంటి లావాదేవీలను ఖాతాదారులు నిర్వహించుకోవచ్చు. ఎయిర్ టెల్ ఫోన్ నంబరు ఉన్న వారు ఆ నంబరును ఉపయోగించి బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ టెల్ వినియోగదారులు కానివారు అయితే, ఆధార్ కార్డు వంటి కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించి బ్యాంకు సేవలను వినియోగించుకోవచ్చు. ఈ సందర్భంగా ఎయిర్ టెల్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, రాజస్థాన్ రాష్ట్రంలో మరిన్ని ఔట్ లెట్లలో బ్యాంకింగ్ సేవలు త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ‘ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్’లో ఖాతాలు ఓపెన్ చేసే వారికి లక్ష రూపాయల విలువ చేసే పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా లభ్యమవుతుందన్నారు.

More Telugu News