: ఢిల్లీలో మూడేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తి.. కొన ఊపిరితో కనిపించిన చిన్నారి

దేశ రాజధాని ఢిల్లీలో ఓ కామాంధుడు అభం శుభం తెలియ‌ని మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. బాలికపై లైంగిక దాడికి పాల్ప‌డి, ఆ త‌రువాత‌ లోతైన గోతిలో పడేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హరిజన్‌ బస్తీలో నివసించే స‌ద‌రు బాలిక త‌న ఇంటి ముందు ఆడుకుంటున్న స‌మయంలో ఆమె వ‌ద్ద‌కు బీర్బల్ అనే వ్య‌క్తి వ‌చ్చి రైల్వే ట్రాకు వద్దకు తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడ‌ని పోలీసులు మీడియాకు తెలిపారు. త‌మ కూతురు క‌నిపించడం లేద‌ని ఆ బాలిక‌ తల్లిదండ్రులు త‌మ‌కు ఫిర్యాదు చేశార‌ని ద‌ర్యాప్తులో బీర్బల్ అనే వ్య‌క్తే ఆ బాలిక‌ను ఎత్తుకెళ్లినట్లు తెలిసిందని చెప్పారు. త‌మ‌కు నిందితుడు ఆ బాలికను పడేసిన గొయ్యిని చూపించాడ‌ని, తాము వెంట‌నే గోతి వ‌ద్ద‌కు వెళ్లి చూశామ‌ని, అక్కడ కొన ఊపిరితో ఉన్న బాలిక‌ను ఆస్పత్రికి తరలించామ‌ని చెప్పారు.

More Telugu News