: ఇండియాలో అతిపెద్ద లేఆఫ్... ఒకేసారి 14 వేల మంది ఉద్యోగులను తొలగించి సంచలనం సృష్టించిన ఎల్ అండ్ టీ

ఇండియాలోని అతిపెద్ద ఇంజనీరింగ్ సేవల సంస్థ లార్సెల్ అండ్ టూబ్రో, దేశంలోనే అతిపెద్ద లే ఆఫ్ కు తెరలేపి సంచలనం సృష్టించింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 11.2 శాతం మందికి సమానమైన 14 వేల మందిని తొలగించింది. దాదాపు 16 బిలియన్ డాలర్ల విలువైన సంస్థ చరిత్రలో ఇంతమందిని తొలగించడం ఇదే తొలిసారి. నిర్మాణ, మౌలిక రంగాల్లో వృద్ధి మందగించి, కాంట్రాక్టులు తగ్గడమే ఉద్యోగుల తొలగింపునకు కారణమని తెలుస్తోంది. పలు విభాగాల్లో సేవలందిస్తున్న కాంట్రాక్టులు, చేతిలో ఉన్న పనితో పోలిస్తే సరైన నిష్పత్తిలో ఉద్యోగులను నిర్వహించాలని నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు సెప్టెంబర్ తో ముగిసిన ఆరు నెలల కాలంలో 14 వేల మందిని తొలగించామని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్ శంకర్ రామన్ వెల్లడించారు. సమీప భవిష్యత్తులో సైతం ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నదే అయి వుంటుందని ఆయన అన్నారు. ప్రైవేటు సెక్టారుకు ప్రభుత్వం నుంచి మరిన్ని ఆర్డర్లు లభిస్తేనే పరిస్థితి చక్కబడుతుందని అంచనా వేశారు. పడిపోతున్న ముడిచమురు ధరలు మార్కెట్ ను కుదేలు చేస్తున్నాయని, దీనివల్ల ఆర్డర్ పుస్తకాలు కుంచించుకు పోతున్నాయని ఆయన అన్నారు. నోట్ల రద్దు తరువాత ఏర్పడిన అనిశ్చితి తొలగేందుకు మరింత సమయం పడుతుందని భావిస్తున్నామని, అన్ని రంగాల్లో రికవరీ స్పష్టంగా కనిపించాల్సి వుందని తెలిపారు. కాగా, సంస్థలో ఏ విభాగం నుంచి ఎంత మందిని తొలగించారన్న విషయాన్ని మాత్రం రామన్ వెల్లడించలేదు.

More Telugu News