: మాకేం ఇబ్బంది లేదు.. నోట్ల ర‌ద్దు మంచిదే!: 'సీ-ఓట‌ర్' స‌ర్వేలో 80 శాతం మంది ప్ర‌జ‌ల అభిప్రాయ‌మిదే

'నోట్ల ర‌ద్దుతో ఇబ్బందులు ప‌డుతున్న మాట వాస్త‌వ‌మే. అయినా ఏం ప‌ర్వాలేదు. న‌ల్ల‌ధ‌నంపై ప్ర‌ధాని ప్ర‌క‌టించిన యుద్ధానికి మా మ‌ద్ద‌తు ఉంటుంది'.. ఇదీ దేశంలోని 80-86 శాతం మంది ప్ర‌జ‌ల అభిప్రాయం. అంత‌ర్జాతీయ పోలింగ్ ఏజెన్సీ సీ-ఓట‌ర్ దేశవ్యాప్తంగా పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన స‌ర్వేలో మెజారిటీ ప్ర‌జ‌లు మోదీ నిర్ణ‌యానికి అనుకూలంగా ఓటేశారు. స‌ర్వేలో పాల్గొన్న గ్రామీణ‌ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నివసిస్తున్న 86 శాతం మంది నోట్ల ర‌ద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్త‌వ‌మేన‌న్నారు. మోదీ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించిన వారిలో చాలామంది అధిక ఆదాయం క‌ల‌వారే. నోట్ల ర‌ద్దు చాలా మంచి నిర్ణ‌య‌మ‌ని, చ‌క్క‌గా అమ‌లు చేస్తున్నార‌ని స‌ర్వేలో పాల్గొన్న వారిలో అధిక‌శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నిర్వ‌హించిన స‌ర్వేలో 71 శాతం మంది ఇదే విధ‌మైన అభిప్రాయం వెల్ల‌డించ‌గా, సెమీ అర్బ‌న్ ప్రాంతాల వారు 65.1 శాతం, సెమీ రూర‌ల్ జోన్స్‌లో 59.4 శాతం మంది నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 23.8 శాతం, సెమీ అర్బ‌న్ ప్రాంతాల్లో 24.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 36 శాతం మంది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని అంగీక‌రించారు. నిర్ణ‌యం మంచిదే అయినా అమ‌లులో లోపాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు నోట్ల ర‌ద్దుతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలా చిన్న‌వ‌ని, వాటి నుంచి తేలిగ్గానే బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని చాలామంది తెలిపారు. ఈ అభిప్రాయం వెల్ల‌డించిన వారిలో 38 శాతం మంది అర్బ‌న్ ప్రాంతాల‌కు చెందిన‌వారు కాగా, 35.5 శాతం మంది సెమీ అర్బ‌న్‌, 36.8 శాతం మంది గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన‌వారు. న‌ల్ల‌ధ‌నంపై యుద్దానికి నోట్ల ర‌ద్దు ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంద‌ని 86 శాతం మంది ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు, 80.6 శాతం మంది సెమీ అర్బ‌న్, 86 శాతం మంది గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. వీరిలో 83.7 శాతం మంది అతి త‌క్కువ ఆదాయం క‌లిగిన వారు కాగా 84.4 శాతం మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు. 90.6 శాతం మంది అధికాదాయ వ‌ర్గాల వారు ఉన్నారు.

More Telugu News