: నోట్ల రద్దుతో విమానాశ్రయంలో కంటతడి పెట్టిన విదేశీయురాలు

నోట్ల రద్దుతో సామాన్యులే కాదు... మన దేశ అందాలను చూద్దామని వచ్చిన విదేశీ టూరిస్టులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. నవంబర్ 10న ఈ ఘటన గోవా ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. లగేజ్ కొంచెం ఎక్కువగా ఉండటంతో ఓ విదేశీ మహిళ రూ. 1600 చెల్లించాల్సి వచ్చింది. అయితే, ఆమె వద్ద రూ. 500, రూ. 1000 నోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో, ఆ డబ్బును తీసుకోవడానికి ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది నిరాకరించారు. చిల్లర కోసం ఎవర్ని అడిగినా లేదనే చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థంకాక... ఆమె కంటతడి పెట్టుకుంది. దీన్ని చూసి చలించిపోయిన ఓ వ్యక్తి ఆమె వద్ద ఉన్న పాత నోట్లను తీసుకుని, కొత్త రూ. 2000 నోటు ఇచ్చాడు. దాంతో, ఆమె ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ విషయాన్ని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ సలహాదారు సంజయ్ యాదవ్ వెలుగులోకి తెచ్చారు. విదేశీయులు కూడా నోట్ల కష్టాలను అనుభవిస్తున్నారని చెప్పడానికే, ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చినట్టు ఆయన తెలిపారు. నోట్ల రద్దు మంచిదే కాని, ప్రజలు కష్టాలు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు.

More Telugu News