: గాలి జనార్దనరెడ్డికి ఐటీ అధికారుల 15 ప్రశ్నలు... శుక్రవారం నాటికి సమాధానం చెప్పాల్సిందే!

కర్ణాటక మైనింగ్ దిగ్గజం గాలి జనార్దనరెడ్డి, తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించి ఐటీ అధికారుల కంట్లో పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలి సొంత సంస్థ ఓబులాపురం మైనింగ్ కంపెనీ సహా, ఆయన ఇంట్లోనూ దాడి చేసిన అధికారులు మూడు పేజీలున్న నోటీసులో 15 ప్రశ్నలను సంధించారు. ఈ ప్రశ్నలకు శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఇందులో, వెడ్డింగ్ కార్డులో ఎల్సీడీ స్క్రీన్ ను అమర్చినందుకు ఎంతైంది? ఎన్ని కార్డులు తయారు చేయించారు? ఎంత మొత్తంతో ఆభరణాలు కొనుగోలు చేశారు? అతిథులకు వినోదం కోసం పిలిపించిన సినీ తారలకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? వంటకాలు ఎన్ని రకాలు? ఎంత మొత్తం ఖర్చైంది? వంటి ప్రశ్నలున్నాయని తెలుస్తోంది. దాదాపు 50 వేల మంది హాజరైన వివాహానికి రూ. 500 కోట్లకు పైగా ఖర్చయినట్టు అంచనా. కాగా, పెళ్లికి రూ. 30 కోట్లు మాత్రమే వ్యయం అయిందని, ఈ మొత్తం కూడా నోట్ల రద్దుకు ఎంతో కాలం ముందే ఈవెంట్ మేనేజర్లకు చెల్లించేశామని ఆయన బంధువులు వెల్లడించారు. ఇక బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరిగిన వివాహానికి కొందరు ఐటీ అధికారులు వెళ్లి, అక్కడి నిలువెత్తు కళారూపాలు, మినీ గ్రామాలు, ఏనుగు రోబోలు, బ్రెజిల్ డ్యాన్సర్లు... ఇలా అక్కడి ఆడంబరాలను ఆశ్చర్యపోయారు. వారిచ్చిన సమాచారం మేరకు ఐటీ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది.

More Telugu News