: కొంచెం ఓపిక పడితే భారత్ భవిష్యత్తు అద్భుతం: బ్రోకరేజ్, రేటింగ్ సంస్థలు

ఇండియాలో నోట్ల రద్దు తరువాత ఏర్పడిన పరిస్థితులు, నోట్ల ఇబ్బందులు తాత్కాలికమేనని, కాస్తంత ఓపిక పడితే భారత్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని బ్రోకరేజ్, రేటింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యునికి మేలు జరగనుందని, వృద్ధి రేటులో ఒడిదుడుకులు ఉన్నా, అది స్వల్పకాలానికి పరిమితమని రేటింగ్ ఏజన్సీ డీబీఎస్ అంచనా వేసింది. ప్రస్తుతానికి వృద్ధి రేటు అంచనాల కన్నా అర శాతం నుంచి ముప్పావు శాతం వరకూ తగ్గవచ్చని ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వ ఖజానా విస్తరించనుందని, పరోక్ష పన్నుల కన్నా ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగనున్నాయని, దీని కారణంగా ద్రవ్యలోటును నియంత్రించ వచ్చని తెలిపింది. నగదు లభ్యత పెరగనుందని, వడ్డీ రేట్లు తగ్గి, బ్యాంకుల్లోని నిల్వలతో మౌలిక ప్రాజెక్టులు వేగవంతమవుతాయని నోమురా వెల్లడించింది. ఆపై గ్రామాల్లో సైతం వినియోగం పెరుగుతుందని పేర్కొంది. జనవరి నుంచి మార్చి మధ్య సాగే నాలుగో త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి 7.3 శాతం నుంచి 6.5 శాతం వరకూ దిగజారవచ్చని వెల్లడించింది. ఆపై 2017-18 ఫస్ట్ క్వార్టర్ లో 7.5 శాతం వృద్ధి సాధ్యమని తెలిపింది. సమీప భవిష్యత్తులో ఇన్ ఫ్లేషన్ 0.20 శాతం వరకూ తగ్గవచ్చని డీబీఎస్ పేర్కొంది. ఆర్బీఐ సైతం కీలక రేట్లను పావు శాతం వరకూ తగ్గించవచ్చని వెల్లడించింది. కాలం గడిచే కొద్దీ పరిస్థితులు చక్కబడి ఇండియా వృద్ధి బాటన దూసుకెళ్లనుందని తెలిపింది.

More Telugu News