: ఫ్లిప్‌కార్ట్‌లో నిత్యావసర సరుకులు విక్రయించేందుకు సన్నద్ధం

ప్రముఖ ఈ-కామర్స్‌ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ సంస్థ వినియోగ‌దారుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌కానుంది. సరికొత్త సేవలను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. తాజాగా సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బిన్నీ బన్సల్ మాట్లాడుతూ వ‌చ్చే ఏడాది నుంచి త‌మ సంస్థ నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను కూడా అందించ‌నుంద‌ని తెలిపారు. కాగా, అమెజాన్ ఇప్ప‌టికే ఈ స‌దుపాయాన్ని ప‌లు న‌గ‌రాల్లో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ వ‌చ్చే ఏడాది ఈ స‌దుపాయాన్ని ప్రారంభించి మూడు సంవత్సరాల్లో త‌మ వినియోగ‌దారుల‌కు క్షేత్ర‌స్థాయిలో ఈ సేవ‌ల‌ను అందించ‌నుంద‌ని బిన్నీ బన్సల్ తెలిపారు. నిత్యావ‌స‌ర‌ సరుకుల విక్ర‌యం కష్టమయిన పనే అయిన‌ప్ప‌టికీ ఆ స‌ర్వీసుల‌తో లాభమేన‌ని చెప్పారు. భారత్‌లో అధిక సంఖ్య‌లో క‌స్ట‌మ‌ర్లు ఫోన్లు, దుస్తులు వంటివి ఆన్‌లైన్‌లోనే ఆర్డ‌రు చేస్తున్నార‌ని చెప్పారు. త‌మ సంస్థ ఫర్నిచర్‌ అమ్మకాల్లోనూ కొన్ని మార్పులు తీసుకురావాల‌ని చూస్తోంద‌ని, ఇందుకు సంబంధించి మరో రెండు మూడు నెలల్లో వినియోగ‌దారులు ఈ స‌ర్వీసులు అందుకోవ‌చ్చ‌ని చెప్పారు. ప‌లు డిజైన్లను ప్రవేశపెట్టాల‌ని తాము చూస్తున్న‌ట్లు బిన్నీ బన్సల్ చెప్పారు. దేశంలో ఆన్‌లైన్‌ అమ్మకాలు 2025 కల్లా ప్ర‌స్తుతం ఉన్న అమ్మ‌కాల కంటే పది రెట్లు పెరుగుతాయ‌ని రిల్‌ లించ్‌ అంచనా వేసింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌మ‌ సంస్థ వచ్చే మూడేళ్లలో ఐపీవోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు.

More Telugu News