: తన శత్రువు గంగూలీపై రవిశాస్త్రి విమర్శలు... కామెంట్రీలో ఘాటు కామెంట్లు

టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్తిల మధ్య వైరం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వారిద్దరి మధ్య చాలా కాలంగానే శత్రుత్వం ఉంది. టీమిండియా చీఫ్ కోచ్ సెలెక్షన్ సందర్భంగా ఆ పదవికి రవిశాస్త్రిని రిజెక్ట్ చేసి, కుంబ్లేని ఎంపిక చేయడంతో వీరి శత్రుత్వం మరింత ముదిరింది. గంగూలీ అనే పేరును ఉచ్చరించడానికి కూడా రవిశాస్త్రి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో, విశాఖలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గంగూలీపై తన అక్కసు తీర్చుకున్నాడు రవిశాస్త్రి. ఈ మ్యాచ్ కు కామెంటేటర్ గా రవిశాస్త్రి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మూడో రోజు ఆట సందర్భంగా రవిశాస్త్రి కామెంట్రీ చెబుతూ... షమీని 'బెంగాల్ సుల్తాన్' అని, ఉమేష్ యాదవ్ ను 'విదర్భ ఎక్స్ ప్రెస్' అని సంబోధించాడు. దీంతో, పక్కనే ఉన్న మరో కామెంటేటర్ ఇయాన్ బోథం మైక్ అందుకుని, బెంగాల్ కు మరో ఐకాన్ వచ్చాడా? 'బెంగాల్ ప్రిన్స్' గంగూలీ ఉన్నాడు కదా? అని ప్రశ్నించాడు. దీంతో ఒళ్లు మండిన రవిశాస్త్రి 'బెంగాల్ కు ప్రిన్స్ లు ఎవరూ లేరు... బెంగాల్ ఏ ఒక్క ప్రిన్స్ కూ చెందింది కాదు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

More Telugu News