: కాపులను బీసీల్లో చేర్చకపోతే అందరి ముందు ఉరేసుకుంటా: కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ

కాపులను బీసీల్లో చేర్చకపోతే అందరి ముందు ఉరేసుకుంటానని ఏపీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే, నూజివీడులో నిన్న కాపు సంఘం కార్తీక వనసమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రామానుజయ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో, అక్కడున్న ఇతర కాపులు కలగజేసుకుని కాపులకు చంద్రబాబు ఏం చేశారంటూ నిలదీశారు. కాపులను బీసీల్లో చేర్చకుండా, కమిషన్ పేరుతో రెండున్నరేళ్లుగా కాలయాపన చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో, కాపులను సముదాయించే ప్రయత్నం చేశారు రామానుజయ. మంజునాథ కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే, కాపులను బీసీల్లో చేర్చడం ఖాయమని చెప్పారు. ఇప్పటికే 10 జిల్లాల్లో మంజునాథ కమిషన్ అభిప్రాయాలను సేకరించిందని.. వారు నివేదిక ఇచ్చిన తర్వాత, కేబినెట్ లో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చకపోతే అందరిముందు తాను ఉరేసుకుంటానని చెప్పారు.

More Telugu News