: శివసేన పార్టీకి భారీగా విరాళాలు.. 85 కోట్లు ఇచ్చిన వీడియోకాన్

మహారాష్ట్రలోని శివసేన పార్టీకి భారీ మొత్తంలో విరాళాలు వచ్చాయి. ఈ విష‌యాన్ని ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో ఆ పార్టీ పేర్కొంది. త‌మ పార్టీకి అత్య‌ధికంగా విరాళాలు ఇస్తోన్న సంస్థ‌ వీడియోకాన్ అని, ఆ సంస్థ త‌మ‌కు 85 కోట్ల విరాళం ఇచ్చిందని తెలిపింది. 2015-16 సంవత్సరానికిగాను త‌మకు వ‌చ్చిన విరాళాల మొత్తం రూ.86.84 కోట్లు కాగా, ఆ విరాళాలు అందించిన‌వ‌న్నీ కార్పొరేట్ సంస్థలు, కార్పొరేటరేతర సంస్థలని, అందులో వీడియోకాన్ ఇచ్చిన‌వే రూ.85 కోట్లు ఉన్నాయ‌ని తెలిపింది. సెప్టెంబర్ 27న శివసేన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్ ఈ వివ‌రాల‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు తెలిపారు. మ‌రోవైపు శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కూడా వీడియో కాన్ 25 లక్షల రూపాయ‌ల విరాళం ఇచ్చింది. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల‌ కమిషన్ వెబ్ సైట్లో ఈ వివ‌రాలు ఉన్నాయి. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్సీపీ కూడా త‌మ ఎన్నిక‌ల సంఘానికి అఫిడ‌విట్ స‌మ‌ర్పించుకున్నాయి. కాగా, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇంకా త‌మ వివ‌రాలు చెప్ప‌లేదు.

More Telugu News