: గిమ్మిక్కుతో సోషల్ మీడియా స్టార్ గా ఎదిగిన వ్యక్తి బండారం బట్టబయలు!

సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిపోతోంది. దీంతో సోషల్ మీడియాలో స్టార్లుగా ఎదిగేందుకు, ఫాలోవర్లను పెంచుకునేందుకు గిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. ఇలా గిమ్మిక్కులకు పాల్పడి స్టార్ గా ఎదిగిన ఓ చైనా స్టార్ బండారం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే... చైనాకు చెందిన బ్రదర్ జీ అనే వ్యక్తి మారుమూల గ్రామాలకు వెళ్లి, అక్కడి ప్రజలకు డబ్బులు పంపిణీ చేస్తూ, ఆ దృశ్యాలను సామాజిక మధ్యమాల ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేవాడు. దీంతో అతను చైనాలో సెలబ్రిటీగా మారిపోయాడు. సోషల్ మీడియా హీరోగా మారి, బోల్డంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అతని బ్లాగ్ ను 6.6 లక్షల మంది ఫాలోఅవుతున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య చైనాలోని సిచువాన్ ప్రావిన్సులోని మారుమూల గ్రామమైన లియంగ్‌ షాన్ ప్రాంతంలో ఓ గ్రామానికి బ్రదర్ జీ వెళ్లాడు. ఎప్పట్లాగే అక్కడ గ్రామస్తులకు డబ్బులు పంపిణీ చేశాడు. ఈ దృశ్యాలను లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. దీంతో అతని అభిమానులు అతనిని పొగడడం ప్రారంభించారు. దీంతో లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. తరువాత అసలు కథ మొదలైంది. లైవ్ స్ట్రీమింగ్ సమయంలో బ్రదర్ జీ ఇస్తున్న డబ్బులను ఆ తర్వాత అతని అసిస్టెంట్ తిరిగి వాళ్ల నుంచి తీసేసుకోవడం ప్రారంభించాడు. దీనిని ఎవరో రహస్యంగా చిత్రీకరించి, సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో బండారం బయటపడిపోవడంతో బ్రదర్ జీ చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఫాలోవర్లను క్షమించాల్సిందిగా కోరాడు. దీంతో అతని వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News