: ఆర్టీసీ బస్సుల్లో పొగలు, మంటలు.. భయంతో కిటికీల ద్వారా దూకి ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కడప నుంచి కర్నూలు వెళ్తున్న కడప డిపోకు చెందిన బస్సులో ఆళ్లగడ్డ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనలో స్పల్ప గాయాలపాలైన ఓ ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ఘటనలో తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద కూడా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. కాకినాడ నుంచి పాడేరు వెళ్తున్న పాడేరు డిపో బస్సు కత్తిపూడి వద్దకు రాగానే ఇంజిన్ నుంచి పొగలు వెలువడ్డాయి. ప్రయాణికులు భయంతో వణికిపోయారు. కిటికీల గుండా కిందికి దూకి పరుగులు పెట్టారు.

More Telugu News