: ‘పెళ్లి కార్డులు చూపిస్తే ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు మార్పిడి చేసుకోవ‌చ్చు’.. కొత్త పుకార్లు.. నిజం లేదన్న ఆర్బీఐ

న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ నోట్ల‌ను నిర్మూలించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యంతో బ్యాంకుల వ‌ద్ద త‌మ నోట్ల‌ను డిపాజిట్, మార్పిడి చేసుకోవ‌డానికి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున బ్యాంకుల‌కు చేరుకుంటున్న‌ విష‌యం తెలిసిందే. అయితే, ఈ నేప‌థ్యంలో వారి నుంచి ఆందోళ‌న కూడా వ్య‌క్తం అవుతోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంద‌రు ప‌లు పుకార్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. ఉప్పుతో పాటు ప‌లు నిత్యావ‌స‌ర స‌రుకుల కొర‌త ఏర్పడింద‌ని వచ్చిన వదంతుల‌కు తోడు, ఇప్పుడు కొత్త కొత్త పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. పాత నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో వివాహాలు వాయిదా ప‌డుతున్నాయ‌ని, ఈ నేపథ్యంలో పెళ్లి కార్డులు చూపిస్తే ఆర్‌బీఐలో ఐదు ల‌క్ష‌లు రూపాయ‌లు మార్పిడి చేసుకోవ‌చ్చని కొత్తగా సోష‌ల్‌మీడియాలో పుకార్లు వ‌స్తున్నాయి. వాటిని న‌మ్మిన కొంద‌రు ప్ర‌జ‌లు పెళ్లి పత్రిక‌ల‌ను చేత ప‌ట్టుకొని ఈ రోజు హైద‌రాబాద్‌లోని ఆర్‌బీఐ శాఖకు చేరుకొని క్యూలో నిల‌బ‌డ్డారు. తీరా బ్యాంకు అధికారుల ద‌గ్గ‌ర‌కు వెళితే, ప్ర‌జ‌లు ఎవ‌ర‌యినా కేవ‌లం 4000 రూపాయ‌లు మాత్రమే మార్పిడి జ‌రుపుకునే అవ‌కాశం ఉందని చెప్పారు. దీంతో వారు నిరాశ‌గా వెనుదిరిగారు. సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న పుకార్లను న‌మ్మ‌కూడ‌ద‌ని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. పుకార్లను వ్యాప్తి చేస్తే అదుపులోకి తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే 500 నోటు వ‌స్తుంద‌ని ఆర్‌బీఐ అధికారులు చెప్పారు. ప్ర‌స్తుతం కొత్త‌ 2000 నోటుతో పాటు 100, 50, 10 రూపాయ‌ల నోట్లు ఇస్తున్నామ‌ని హైద‌రాబాద్ ఆర్‌బీఐ శాఖ అధికారులు పేర్కొన్నారు.

More Telugu News