: కొట్లాడుకున్న అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా... సీరియస్ అయిన గంగూలీ

ప్రస్తుతం బెంగాల్ తరఫున రంజీ పోటీలు ఆడుతున్న అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజాల మధ్య తీవ్ర కొట్లాట జరుగగా, ఆటగాళ్లు అతి కష్టం మీద విడిపించారట. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ సంఘం సీనియర్ అధికారి ఒకరు వివరించారు. తమిళనాడుతో జరిగే పోరు కోసం నెట్ ప్రాక్టీసులో భాగంగా ఫుట్ బాల్ ఆడుతున్న వేళ ఈ ఘటన జరిగింది. దిండా తన కాలితో ఫుట్ బాల్ ను గట్టిగా తన్నగా, అది ఓజా చెవి పక్కనుంచి దూసుకెళ్లిందట. కొద్దిలో గాయపడేవాడినన్న ఆలోచనతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఓజా, గట్టిగా అరవడంతో, దాన్ని సీరియస్ గా తీసుకున్న దిండా కూడా కోపంగా ఓజా మీదకు వచ్చాడట. ఆపై ఓజాను ఉద్దేశించి 'అవుట్ సైడర్' అని ఎగతాళిగా మాట్లాడిన దిండా, కొట్లాటకు దిగగా, జట్టు కెప్టెన్ మనోజ్ తివారీ, కోచ్ సాయిరాజ్ బహుతులే, ఇతర ఆటగాళ్లు అతి కష్టం మీద వారిని విడిపించాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇక విషయాన్ని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దృష్టికి తీసుకెళ్లగా, విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన, ఇటువంటి ఘటనలు మంచివి కాదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News