: తమిళ సినీ, టీవీ నటి సబర్న అనుమానాస్పద మృతి

ప్రముఖ తమిళ సినీ, టీవీ నటి సబర్న అలియాస్ సుగుణ (29) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని సీమతమాన్ నగర్ లో ఆమె నివాసం ఉంటోంది. గత మూడు రోజులుగా ఆమె ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. ఈ క్రమంలో, ఆమె ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో... పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అన్నాసాగర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం ఇంటి తలుపును బద్దలుకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె తలపై బలమైన గాయం ఉండటంతో, మృతిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దుర్వాసన కూడా వస్తుండటంతో, మూడు రోజుల క్రితమే ఆమె చనిపోయి ఉంటుందని చెబుతున్నారు. ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సబర్న తల్లిదండ్రులు, సోదరుడు పక్కనే ఉన్న విరుగంబాక్కంలో నివాసం ఉంటున్నారు. ఓ మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన సబర్న... ఆ తర్వాత సీరియళ్లు, సినిమాల్లో నటించింది. కలై, కుదిరసు, పూజైలాంటి చిత్రాల్లో ఆమె నటించింది.

More Telugu News