: కేసీఆర్ తప్పుడు నిర్ణయాలకు 25 మంది అధికారులు బలి: రేవంత్

స్వార్థంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు 25 మంది అధికారులు బలి కాబోతున్నారని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వీరంతా జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చిందని తెలిపారు. కమిషన్ల కోసం భద్రాద్రి పవర్ ప్లాంట్ పనులను కాలం చెల్లిన టెక్నాలజీతో చేపట్టారని మండిపడ్డారు. మరోవైపు, ప్లాంట్ కు అనుమతి లేకపోవడంతో అధికారులపై గ్రీన్ ట్రైబ్యునల్ కేసులు నమోదయ్యాయని రేవంత్ తెలిపారు. ఈ ప్లాంట్ వ్యవహారంలో వేల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి, విద్యుత్ మంత్రిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కోసమే ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ ను కేసీఆర్ కొంటున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క మెగావాట్ విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ అవలంబిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై టీడీపీ పోరాడుతుందని తెలిపారు.

More Telugu News