: వేడెక్కిన పంజాబ్ రాజకీయాలు... ఏకంగా 42 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా

సట్లెజ్‌-యుమునా లింకు(ఎస్‌వైఎల్‌) కెనాల్‌ నీటి వివాదంపై తాజాగా సుప్రీంకోర్టు హ‌ర్యానాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్‌ నేత‌లు రాజీనామాల బాట ప‌ట్టారు. వ‌చ్చే ఏడాది ఆరంభంలోనే పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అక్క‌డి రాజ‌కీయాలు వేడెక్కాయి. త‌మ రాష్ట్రానికి ప్ర‌తికూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన‌ తీర్పును ఖండిస్తూ పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు అమరీందర్‌ సింగ్ నిన్న త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న బాట‌లోనే న‌డ‌వాల‌ని త‌మ ఎమ్మెల్యేల‌కు సూచించారు. దీంతో ఈ రోజు ఏకంగా 42 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సట్లెజ్‌-యుమునా లింకు అంశంలో 2004లో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం గురించి విచారించిన సుప్రీంకోర్టు... నిన్న ఆ చ‌ట్టం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. ఇత‌ర రాష్ట్రాల‌పై ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించే అంశాలు అందులో ఉండ‌డంతో సుప్రీం పంజాబ్‌కు వ్య‌తిరేకంగా తీర్పునిచ్చింది. మ‌రోవైపు సుప్రీం తీర్పుపై స్పందించిన పంజాబ్ ముఖ్య‌మంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్ హ‌ర్యానా రాష్ట్రానికి నీరు విడుద‌ల చేయ‌బోమ‌ని తేల్చిచెప్పారు.

More Telugu News