: వికెట్లు తీయడంలో భారత బౌలర్లు విఫలం కావడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు

రాజ్ కోట్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ ఓడిపోయి ఫీల్డింగ్ చేపట్టిన భారత జట్టులో బౌలర్లెవరూ పెద్దగా రాణించకపోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. తొలిరోజు ఆటను నాలుగు వికెట్ల నష్టానికి 311 పరుగుల వద్ద ముగించిన ఇంగ్లండ్, ఈ ఉదయం నుంచే ధాటిగా ఆడటం ప్రారంభించింది. ఈ క్రమంలో 100వ ఓవర్ లో 343 పరుగుల వద్ద సెంచరీ చేసిన అలీ (213 బంతుల్లో 117 పరుగులు) వికెట్ ను కోల్పోయినప్పటికీ, స్ట్రోక్స్ ధాటిగా ఆడుతూ స్కోరును ముందుకు దూకించాడు. బెయిర్ స్టో సహకారంతో స్కోరును 400 పరుగుల మైలురాయిని దాటించాడు. భారత బౌలర్లలో 38 ఓవర్లు వేసిన అశ్విన్, 18 ఓవర్లు వేసిన షమీలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. 25 ఓవర్లు వేసిన ఉమేష్, 22 ఓవర్లు వేసిన జడేజాలకు చెరో వికెట్ మాత్రమే దక్కింది. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 121 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 442 పరుగులు కాగా, మిగతా నాలుగు వికెట్లను సాధ్యమైనంత త్వరగా పడగొట్టకుంటే, భారత జట్టు మరిన్ని కష్టాల్లోకి కూరుకుపోయినట్టే.

More Telugu News