: పగలంతా ఆగి.. రాత్రి కాగానే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు మోదీ ఎందుకు ప్రకటించారు?

పెద్ద నోట్ల రద్దు ప్రకటన విషయం కోసం ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం బ్యాంకు లావాదేవీలు ముగిసేంత వరకు ఎందుకు ఆగారు? రాత్రి 8 గంటల వరకు ఎందుకు వేచి చూశారు? దీనికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. సాధారణంగా అన్ని బ్యాంకుల్లో సాయంత్రం ఐదు గంటలకు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఆ తర్వాత ఆయా బ్యాంకుల్లో వెయ్యి, ఐదు వందల నోట్లు ఎన్ని ఉన్నాయో చెక్‌లిస్ట్ ఆర్బీఐకి అందుతుంది. దీంతో మొత్తం క్యాష్ ఎంత ఉందనేది తెలిసిపోతుంది. ఈ మొత్తం సమాచారం అందే వరకు మోదీ ఆగారు. చివరి నిమిషంలో రాత్రికి రాత్రి పెద్దమొత్తంలో కోట్లాది రూపాయలు చేతులు మారకుండా ఉండేందుకే ఇలా చేశారు. పెద్ద నోట్లు రద్దు చేశారని తెలియగానే బడా బాబులు తమకు తెలిసిన బ్యాంకు మేనేజర్లను ఆశ్రయించి తమ వద్ద ఉన్న నల్ల డబ్బును రాత్రికి రాత్రే బ్యాంకుకు తరలించి రూ.వంద, రూ.యాభై నోట్లుగా మార్చేసుకుంటారు. ఇలా దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల నల్లడబ్బు తెల్ల డబ్బుగా మారిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోతుంది. దీనిని నివారించేందుకే మోదీ ప్రకటన కోసం రాత్రి వరకు ఆగినట్టు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు నల్లడబ్బును తెల్లగా మార్చుకునేందుకు కొందరు బంగారంపై దృష్టి సారిస్తారు. షేర్ మార్కెట్లలోనూ పెట్టేందుకు ప్రయత్నిస్తారు. అందుకే అవి కూడా మూసేసిన తర్వాత మోదీ ప్రకటన వెలువడింది. మరో విషయం ఏమిటంటే, సట్టా బజార్‌పైనా రద్దు ప్రభావం పడింది. అమెరికా ఎన్నికలపై కోట్లాది రూపాయల బెట్టింగ్ జరిగింది. రాత్రి ఒంటిగంట తర్వాత ఫలితాలు రావడం ప్రారంభమయ్యాయి. అందుకే, రాత్రి 12 తర్వాత కరెన్సీకి విలువ లేకుండా చేశారు.

More Telugu News