: రూ.500, రూ.2000 నోట్లు అవసరం లేదు: చంద్రబాబు నాయుడు
రూ.500, రూ.2000 నోట్లు అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, నల్లధనాన్ని అరికట్టాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, దేశంలో నల్లధనం, అవినీతిని పారద్రోలేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా మోదీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపానని చెప్పారు. రూ.2 వేల నోట్లు అసలు అవసరమే లేదని, ఈ నోటును తాత్కాలికంగా విడుదల చేసినా, ఆ తర్వాత రద్దు చేయాలని అన్నారు. రూ.2 వేల నోటుపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత నగదుతో అవసరమేముందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ టెక్నాలజీ వాడకం పెరిగిందని, ఇకపై, అన్నీ నగదు రహిత లావాదేవీలు జరగాలని అన్నారు. మళ్లీ నల్లధనం పెరగకుండా చర్యలు తీసుకోవాలని, దేశానికి ఏది లాభమో అది ఆలోచించాలని అన్నారు.