: మ్యారేజ్ బ్యూరో పెట్టి, తానే పెళ్లికూతురినని మోసం చేస్తున్న యువతి అరెస్ట్

డబ్బు సంపాదించేందుకు మరో సరికొత్త ఆలోచన చేసిందో యువతి. ఓ మ్యారేజ్ బ్యూరో పెట్టి, మంచి సంబంధాలు కుదుర్చుతానని చెబుతూ, యువకులను మోసం చేసి, వారి నుంచి డబ్బు దండుకుని, తానే పెళ్లికూతురిని అన్నట్టు కలరింగ్ ఇచ్చి, ఒకటి రెండు సార్లు వారితో మాట్లాడి, ఆపై ఇష్టం లేనట్టు తప్పుకుంటూ ఎంతో మందిని మోసం చేసిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, సైదాబాద్ ప్రాంతంలోని సంధ్యారాణి అలియాస్ రాణి, అలియాస్ సుజాత అనే యువతి దినపత్రికల్లో నందిని మ్యారేజ్ బ్యూరో పేరిట వరుడు కావాలంటూ ప్రకటనలు ఇచ్చింది. ఆ ప్రకటన నచ్చి లంగర్ హౌస్ కు చెందిన రఘురామ్ రెడ్డి అనే యువకుడు సంధ్యారాణిని సంప్రదించగా, సంబంధం కుదిర్చేందుకు రూ. 10 వేలు కట్టాలని చెప్పి, వాటిని వసూలు చేసుకుంది. రెండు రోజుల తరువాత, తానే స్వయంగా ఫోన్ చేసి రఘురామ్ రెడ్డితో మాట్లాడింది. ఆపై స్పందించడం మానేసింది. తన పెళ్లి సంబంధం గురించి అడిగిన రఘురామ్ ను మరో రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో అనుమానంతో అతను పోలీసులను ఆశ్రయించగా, ఫోన్ లో వధువులా మాట్లాడింది సంధ్యారాణేనని తేల్చి ఆమెను అరెస్ట్ చేశారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News