: ఒకే ఒక్క మాటతో 15 లక్షల కోట్ల డబ్బు రద్దు.. వీటిలో తెలుపు ఎంత? నలుపు ఎంత?

పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ఒక్కే ఒక్క మాటతో దేశంలో ఏకంగా 2,320 కోట్ల పెద్ద నోట్లు రద్దయ్యాయి. వాటి విలువ సుమారు రూ.15 లక్షల కోట్లు. ఈ సొమ్ములో నలుపు ఎంత? తెలుపు ఎంత? అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు తమ వద్ద ఉన్న రూ.1000, రూ.500 నోట్లను మార్చుకుంటేనే అది తెల్లధనంగా మారుతుంది. డిసెంబరు 30లోగా పెద్దనోట్లను మార్చుకోకపోతే మిగిలినదంతా నల్లధనంగానే భావించాల్సి ఉంటుంది. కష్టార్జితమైతే బ్యాంకులకు వెళ్లి మార్చుకోవడం పెద్ద సమస్య కాదు. గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. నల్లధనమైతే మాత్రం చిక్కుల్లో పడినట్టే. ఆర్థిక విభాగం నిఘాకు చిక్కి ఊచలు లెక్కపెట్టుకోవాల్సి వస్తుంది. మారుపేర్లతో అనుమానాస్పదంగా పెద్దమొత్తంలో నగదు మార్చుకునే ప్రయత్నం చేస్తే బ్యాంకు సిబ్బంది ఆర్థిక నిఘా విభాగానికి వారి పొటోలతో సహా సమాచారం పంపిస్తారు. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ ప్రకారం.. దేశంలో రూ.1650 కోట్ల రూ.500 నోట్లు చలామణిలో ఉన్నాయి. వాటి విలువ రూ.8.25 లక్షల కోట్లు. చలామణిలో ఉన్న వెయ్యి రూపాయల నోట్ల సంఖ్య 670 కోట్లు. వాటి విలువ రూ.6.7 లక్షల కోట్లు. దీనిని బట్టి మంగళవారం రాత్రి నుంచి రద్దయిన నోట్ల విలువ రూ.14.95 లక్షల కోట్లు.

More Telugu News