: నల్లధనం ప్రవాహానికి ప్రధాని అడ్డుకట్ట మంత్రం.. 500, 1000 నోట్ల రద్దుపై ప్రధాని ఏమన్నారంటే..!

ప్రధాని నరేంద్ర మోదీ భారత జాతినుద్దేశించి మాట్లాడుతూ, సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఒక వెలుగు రేఖ అని ఐఎంఎఫ్‌ చెప్పిందని, అలాంటి భారతదేశానికి సరైన దిశానిర్దేశం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశం నల్లధనం, అవినీతి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగంతో అనేకమంది భారీ సంపదను అక్రమ మార్గాల్లో కూడగట్టారని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఎంతో మంది నిజాయతీ పరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, అయితే వారంతా సవాళ్లు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. వారందరికీ అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. సాధారణ పౌరుడు అత్యంత నిజాయతీతో జీవిస్తున్నాడని ప్రధాని కితాబునిచ్చారు. అధికారం ఆనుపానులు తెలిసినవాళ్లు మాత్రమే అత్యధికశాతం అవినీతికి పాల్పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. దీనిని ఆసరాగా చేసుకున్న ఉగ్రవాద సంస్థలు 500, 1000 రూపాయల దొంగనోట్లను చెలామణి చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయని ఆయన తెలిపారు. దేశంలోని అవినీతిపరుల ఆటకట్టించేందుకు బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. అయితే వారిని పూర్తిగా అరికట్టాలంటే వారి ఆర్థిక మూలాలపై బలమైన దెబ్బతగలాలని ఆయన చెప్పారు. అందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలిపారు. అందులో భాగంగా తాము కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో నేటి అర్ధరాత్రి నుంచి 500 రూపాయలు, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నామని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయం అమలులో కీలక సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఆ సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఈ ప్రయోగం సఫలమవుతుందని భావిస్తున్నామని, విఫలమైతే పాఠాలు నేర్చుకుంటామని ఆయన చెప్పారు. రద్దు చేస్తున్న 500 రూపాయలు నోట్లు, 1000 రూపాయల నోట్లు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 31 వరకు బ్యాంకులు లేదా పోస్టాఫీసులలో మార్చుకోవచ్చని ఆయన సూచించారు. ఒకవేళ ఏవైనా అనివార్య కారణాలతో ఆ డబ్బును డిసెంబర్ లోపు మార్చుకోలేని వారికి మార్చివరకు అవకాశం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆన్ లైన్ లావాదేవీలు, ఆన్ లైన్ కొనుగోళ్లు, చెక్కులపై ఎలాంటి నియంత్రణ లేదని ఆయన స్పష్టం చేశారు. నగదు లావాదేవీలపై మాత్రమే నియంత్రణ ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే నగదు డ్రాపై వారానికి గరిష్ఠంగా 20 వేల రూపాయల పరిమితిని విధిస్తున్నట్టు తెలిపారు. రోజుకు గరిష్ఠంగా పది వేల రూపాయల విత్ డ్రాను మాత్రమే అనుమతించనున్నట్టు కూడా ఆయన తెలిపారు. దీంతో నేటి అర్ధరాత్రి నుంచే 500, 1000 రూపాయల నోట్ల ముద్రణను రద్దు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. నవంబర్ 12 వరకు 500 లేదా 1000 రూపాయల నోట్లు మందుల షాపులు, రైల్వే, బస్, విమాన టికెట్ కౌంటర్లు వంటి అత్యవసరమైన ప్రాంతాల్లో మాత్రమే చెల్లుతాయని ఆయన స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయాల్లోనే పాత 500, 1000 రూపాయలు నోట్లు కలిగి ఉన్నవారి నుంచి 5000 రూపాయల వరకు మార్చుకునే అవకాశం కల్పించనున్నామని ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగం పనిచేయనుందని ఆయన తెలిపారు. ఈ మొత్తం విధానం పర్యవేక్షణకు కొత్తగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నామని ఆయన ప్రకటించారు. అనంతరం రద్దు చేసిన కరెన్సీ స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను వాడుకలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ తమ లక్ష్యమని ఆయన చెప్పారు. దేశ ప్రజల శ్రేయస్సుకే తామీ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.

More Telugu News