: గ‌తంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న జ‌గ‌న్, ఇప్పుడు సొంతంగా దోచుకోవడానికి య‌త్నిస్తున్నారు: మంత్రి కామినేని

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత కరుణాకర్‌రెడ్డికి సంస్కారం ఉందా? అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గ‌తంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి హిందూ మతంపై విశ్వాసం లేని కరుణాకర్‌రెడ్డికి ఛైర్మన్‌ పదవి ఇచ్చార‌ని ఆయ‌న అన్నారు. టీటీడీ ఛైర్మన్‌ పదవిలో కరుణాకర్‌రెడ్డి అక్రమాలకు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న ఆరోపించారు. మ‌రోవైపు వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై కూడా కామినేని మండిప‌డ్డారు. ఇటీవ‌ల విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు లేవని ప‌లు వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆయ‌న వాస్తవ పరిస్థితులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నార‌ని అన్నారు. 'జ‌గన్‌కు మంచి కనబడదు, వినబడ‌దు' అని కామినేని వ్యాఖ్యానించారు. గ‌తంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న జ‌గ‌న్ ఇప్పుడు సొంతంగా దోచుకోవడానికి య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇప్పటికైనా జ‌గ‌న్‌ బుద్ధి మార్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

More Telugu News