: ఢిల్లీలో ఇంత ఘోర పరిస్థితిని ఎన్నడూ చూడలేదు: ఫారిన్ మీడియా

ఢిల్లీని కమ్మేసినటువంటి పొగమంచు మేఘాలను గతంలో ఎన్నడూ చూడలేదని, భారత రాజధానిలో ఇంతటి ఘోర పరిస్థితి ఇదే తొలిసారని కాలుష్యంపై విదేశీ మీడియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీని విషపూరితమైన మేఘాలు కమ్మేసి వారం దాటగా, ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించి, ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరిన సంగతి తెలిసిందే. పలు క్రికెట్ మ్యాచ్ లు రద్దు కాగా, అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని కేజ్రీవాల్ సర్కారు కోరింది. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, 'వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ పరిస్థితి రావడానికి స్వీయాపరాధాలే కారణమంటూ, దీపావళి టపాసులు పేల్చడం, పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాల దహనం వంటి అంశాలను ప్రస్తావించింది. ఢిల్లీ యూఎస్ ఎంబసీలోని ఎయిర్ మానిటర్ అందించిన వివరాల ప్రకారం, 2.5 పీఎంగా మాత్రమే ఎయిర్ క్వాలిటీ ఉందని, పర్యావరణ శాఖ ఆమోదించే స్థాయితో పోలిస్తే ఇది ఆరు రెట్లు తక్కువని పేర్కొంది. ఈ గాలి పీలిస్తే ఎన్నో రోగాలు వస్తాయని హెచ్చరించింది. ప్రపంచంలోనే అత్యధికులు నివసించే 11వ నగరంగా గుర్తింపు పొందిన ఢిల్లీలో వాతావరణం ఇంత భయంకరంగా మారడానికి కారణం మీరంటే మీరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నాయని 'వాషింగ్టన్ పోస్ట్' తెలిపింది.

More Telugu News