: రూ. 340 కోట్లతో రామ్ గోపాల్ వర్మ 'న్యూక్లియర్'

సంచలనాలకు కేంద్ర బిందువైన ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ప్రకటన చేశాడు. రూ. 340 కోట్లతో తొలి అంతర్జాతీయ సినిమాను తీయబోతున్నానని ఆయన ప్రకటించాడు. ఆ సినిమా పేరు 'న్యూక్లియర్' అని వర్మ ట్వీట్ చేశాడు. సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఏంటో ఓ ఫొటో ద్వారా వెల్లడించాడు. "ముంబైలోకి ఓ అణుబాంబు స్మగుల్డ్ అవుతుంది. కాశ్మీర్ ను ఖాళీ చేయాలని డిమాండ్. ఇందులో తమ పాత్ర లేదని పాక్ బుకాయిస్తుంది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఎంటర్ అవుతుంది. లక్షలాది ప్రాణాలు పణంగా... మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం"... ఇదీ టూకీగా వర్మ చెప్పిన సంగతి. మరోవైపు మరిన్ని వివరాల కోసం ttp://www.cmaglobal.in #RGVNUCLEAR లింక్ ను ఓపెన్ చేయండంటూ తెలిపాడు. తన తాజా సినిమా 'సర్కార్ 3' రిలీజ్ కాగానే 'న్యూక్లియర్' చిత్రం ప్రారంభమవుతుందని వర్మ ట్వీట్ చేశాడు. ఈ సినిమాను సీఎంఏ గ్లోబల్ సంస్థ నిర్మిస్తుందని... ఈ సంస్థతో తనకు చాలా కాలంగా టైఅప్ ఉందని చెప్పాడు. అమెరికా, రష్యా, చైనా, యెమెన్ లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిపాడు. ఈ చిత్రంలో అమెరికన్, చైనీస్, రష్యన్, ఇండియన్ యాక్టర్స్ ఉంటారని చెప్పాడు.

More Telugu News