: ఇకపై 'తెలంగాణ చలన చిత్ర పురస్కారాలు'... ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులు

తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు సినీ రంగానికి నంది అవార్డులు ఇచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రం రెండు ముక్కలైంది. దీంతో, తెలంగాణలో ఏం చేయాలన్న దానిపై ఓ ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 'తెలంగాణ చలన చిత్ర పురస్కారాల' పేరిట అవార్డులు ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. 2014 జూన్ 2వ తేదీ నుంచి, 2015 డిసెంబర్ వరకు తెలంగాణలో నిర్మించిన చిత్రాలకు పురస్కరాలు అందజేయాలని సూచించింది. అయితే గతంలో ఏపీతో కలిపి చలనచిత్ర పురస్కారాలు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. కానీ, ఏపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తెలంగాణ పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ సినీ పురస్కారాలలో కొన్నిటికి పేర్లు కూడా సిఫార్సు చేసింది... తెలంగాణకు చెందిన చలనచిత్ర ప్రముఖుడికి - కాంతారావు అవార్డు జాతీయ స్థాయి ప్రముఖుడికి - పైడి జయరాజు అవార్డు ఉత్తమ కుటుంబ చిత్రానికి - ప్రభాకర్ రెడ్డి పురస్కారం ఉత్తమ గీత రచయితకు - దాశరథి అవార్డు ఉత్తమ సంగీత దర్శకుడికి - చక్రి అవార్డు అంతేకాదు, పురస్కారాలకు పారితోషికం కూడా పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. కమిటీలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, చలనచిత్ర సంస్థ ఎండీ నవీన్ మిత్తల్, ఎన్ శంకర్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, కె మురళీమోహన్, పి రామ్మోహన్ రావు, కె సురేష్ తదితరులు ఉన్నారు.

More Telugu News