: అప్పుడు నా మొబైల్‌ను కూడా స్విచ్చాఫ్ చేశా.. బోపన్న, నేను మాట్లాడుకోలేదు: సానియా మీర్జా

ఒలింపిక్స్‌లో కొద్దిలో పతకం చేజార్చుకున్నాక తాను, రోహన్ బోపన్న అనుభవించిన వేదన అంతా ఇంతా కాదని టెన్సిస్ స్టార్ సానియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. పతక పోరు ముగిసిన రెండు గంటల్లోనే తాను, బోపన్న కలిసి సిన్సినాటి టోర్నీకి బయలుదేరామని చెప్పిన సానియా దాదాపు గంట పాటు తామిద్దరం ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదని, తన మొబైల్‌ను కూడా స్విచ్చాఫ్ చేశానని పేర్కొంది. ఓటమి తర్వాత వర్ణించలేనంత బాధను అనుభవించామని తెలిపింది. ఒలింపిక్స్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి ఉంటే అంతగా బాధపడి ఉండేవాళ్లం కాదని, కానీ తృటిలో పతకాన్ని చేజార్చుకోవడంతో తన గుండె పగిలినట్టు అయిందని తెలిపింది. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవడం కూడా చిన్న విషయమేమీ కాదని పేర్కొంది. అయితే లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం తమను బాధించిందని వివరించింది. పోరు ముగిశాక క్రీడా గ్రామం నుంచి విమానాశ్రయానికి వెళ్లడానికి 1:15 గంటలు పట్టిందని, ఆ సమయంలో ఒకటి రెండు మాటలు తప్పితే పెద్దగా మాట్లాడుకోలేదని పేర్కొంది. ‘‘బాధపడకు, వచ్చేసారి చూద్దాం’’ వంటి సందేశాలు తనకు ఇష్టముండదని, అందుకే సెల్ స్విచ్చాఫ్ చేశానని వివరించింది.

More Telugu News